మందాకిని పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ‘సింహాసనం’, బాలీవుడ్ ప్రేక్షకులకు రామ్ తేరీ గంగా మైలి’ గుర్తొస్తాయి. అప్పట్లో సింహాసనం సినిమాలో మందాకిని నటిస్తోందనే వార్త విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చింది. అలా క్రేజు కొనసాగుతున్నప్పుడే ఎందుకో చిత్ర పరిశ్రమకు దూరమైంది. గాజు కళ్ల గ్లామర్ గర్ల్ ని తిరిగి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ ఆమె అంగీకరించలేదు. ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి నటించడానికి సిద్ధమైంది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మందాకిని తను మళ్లీ నటిస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం తన కొడుకు రబ్బిల్ ఠాకూర్ తో కలిసి ‘మా ఓ మా’ అనే వీడియో సాంగ్ లో నటిస్తోంది. సజన్ అగర్వాల్ దర్శకత్వం వహించిన ఈ పాట షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభమవుతుంది. దీన్ని ద్రుష్టిలో పెట్టుకొని దక్షిణాది నిర్మాతలు, దర్శకులు తమ సినిమాలో తల్లి పాత్రలో మందాకినిని నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాదిలో రూపొందుతున్న సినిమాలు పాన్ ఇండియా మూవీగా టార్గెట్ చేస్తూ నిర్మితమవుతున్నాయి. ఇదే క్రమంలో మందాకిని తల్లి పాత్రలో నటిస్తే బాగుంటుంది. అదీ గాక ఓటీటీలో మంచి మొత్తం రాబట్టే అవకాశం వుంది అని నిర్మాతలు చెబుతున్నారు. తెలుగులో మందాకిని గతంలో సూపర్ స్టార్ క్రిష్ణతో ‘సింహాసనం’ బాలక్రిష్ణతో ‘భార్గవరాముడు’ చిత్రాలలో నటించింది. కాబట్టి తెలుగు సినిమాల్లో ఆమెను ఒప్పించడం పెద్ద కష్టమేం కాదు అని ఓ నిర్మాత తెలిపారు. ప్రస్తుతం మందాకిని పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.
Social Plugin